Loading...
.

తిప్పన్న గాడిద......


తిప్పన్నకు చాకిరేవే ప్రపంచం . ఊరందరి బట్టలూ ఉతికి గంపెడు సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు . తిప్పన్న కొక గాడిదుంది దాని పేరు తిమ్మన్న. తిప్పన్న సంసారం పెరిగేకొద్దీ తిమ్మన్న బరువూ పెరుగుతూ వచ్చింది. అసలు ఒక్కమాటలో చెప్పాలంటే తిప్పన్న సంసారం బరువు తిమ్మన్న వీపుమీదుగా వెళ్లమారుతోంది
ఒకరోజు తిప్పన్న బండెడు బట్టలుతికి అరేశి పొద్దువాలే వేళకి బట్టలన్నీ మూటలుకట్టి తిమ్మన్న మీద పేర్చాడు. ఎంతగాడిదైనా ఎన్నిమూటలని మోస్తుంది..? కానీ తిమ్మన్న బాధ తిప్పన్న కేమెరుక..? మూట మీద మూట రెండే గాడిదల బరువు ఒక్క గాడిదమీదే వేసి తను చిన్నమూట మాత్రం భుజాన వేసుకుని చేతులు ఊపుకుంటూ “చల్ చల్” అంటూ ముందడగు వేస్తాడు పాపం తిమ్మన్న మూలుగుతూ ముక్కుతూ ముందడుగు వేస్తుంది.

కొంతదూరం పోయేసరికి భార్య అన్నమాట గుర్తొచ్చింది. “పోయిలోకి బొత్తిగా పుల్లలేవు. రోజూ ఏటికెళ్తావేగాని ఏనాడన్నా నాలుగు ఎండుకట్టెలు తెచ్చావా..? అని గొడవ వేసుకోసాగింది ఆ విషయం గుర్తువచ్చిన వెంటనే తిప్పన్న అటూ ఇటూ చూశాడు రోడ్డుపక్క ఎండి పోయిన చెట్టొకటి కనిపించింది.భుజానున్నమూటని తిమ్మన్న మీదికి విసిరి గబగబా వెళ్లి ఎండిన నాలుగు కొమ్మలు విరుచుకొచ్చి తిమ్మన్న మీద వేశాడు . తిమ్మన్న మూలిగింది “ఎండిన కొమ్మలేగా ఏమంత బరువులే పద” అన్నాడు. మరి నాలుగడుగులు వేసేసరికి ఆఖరబ్బాయి మాట గుర్తొచ్చింది. వాడికి తాటి పళ్ళంటే మహా ఇష్టం కదా అనుకుంటూ అటూ ఇటూ చూశాడు తాటిచెట్ల క్రింద పండిరాలిన నాలుగైదు తాటిపళ్ళు కనిపించాయి వాటిని కూడా మూటల్లో కుక్కాడు. తిమ్మన్న మళ్లీ మూలిగింది “తవ్వెడు తౌడు తింటావే, నాలుగు తాటికాయలు మొయ్యలేవూ..?” అని అదిలించాడు. పదడుగులు వేసే సరికి గట్టుమీద నవనవలాడుతూ పచ్చగడ్డి కనిపించింది. గడ్డి పరకలు చూడగానే మేకపిల్ల గుర్తొచ్చింది. గబగబా నాలుగు గుప్పెళ్లు పెరికి పిడికెంత మోపుకట్టి .. “ ....... ఈ గడ్డిపరకలు కూడా బరువేనని మూల్గితే ఇక నీ పని అంతే........” అంటూ గడ్డిపరకల్ని కూడా తిమ్మన్న మిద వేశాడు. అప్పటికే అలసిపోయిన తిమ్మన్న పిడుగుపడ్డట్టు నేలకూలింది..
లబొదిబోమన్న తిప్పన్న తను చేశిన తప్పుకు బాధ పడుతూ బండెడు బరువుకు కుంగని గాడిద గుప్పెడు గడ్డి కింద ఎందుకు పడిందోనని ఆలోచిస్తూ ఆ బరువును మొత్తాన్ని ఎలా తీసుకెల్లాలలో అర్ధంకాక తలుపట్టుకూర్చున్నాడు.

దురాశ , ఆశబోతు....

" అదిగో కుందేలు, పట్టుకో , పట్టుకో..." అనటమే ఆలస్యము వేటకుక్క దౌడందుకుంది. మెరుపు వేగంతో దూసుకుపోతోంది. కాళ్లకిందున్న రాళ్లను, ముళ్లనూ లెక్క చేయటం లేదు. పొదల్లో దూరుతోంది,పిల్ల కాలువల మీంచి గెంతుతోంది,కొండరాళ్ల మీదికెక్కి అమాంతంగా గుంతల్లోకి దూకుతోంది....కుందేలును వెంటాడుతూనే ఉంది... వెంటాడి,వేటాడి చిట్టచివరకు కుందేలును పట్టుకుంది.పట్టుకుని విజయగర్వంతో వెనుదిరిగింది.ప్రపంచమంతా తనకి జేజేలు పలుకుతూన్నట్టు తోకాడిస్తూ ఉరుకులు పరుగుల మీద వేటగాడి దగ్గరికి వచ్చింది.
వేటగాడు చేయిచాచి వేటకుక్క నోట్లో ఉన్న కుందేలు చెవులు వొడిసి పట్టుకొని " వదిలేయి చల్! హుట్ హుట్ " . కుందేలును వదిలేసిన వేటకుక్క తోకముడిచింది. కుందేలును బుట్టలో వేసుకున్న వేటగాడు కులాసాగా వెళ్లిపోయాడు వేటకుక్క బానిసలా ఈసురోమంటూ వెనుక వెళ్లంది.
ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక తాత తన మనవడితో ఇలా అన్నాడు..? ఆ వేటగాడెవరో తెలుసా..? అని తెలీదు అన్నట్టు తలవూపాడు మనవడు. తాత మరలా చెప్పటం మెదలు పేట్టాడు వేటగాడు పేరు దురాశ, వేటకుక్క పేరు ఆశబోతు. దురాశకు లొంగి ఆశబోతు అడ్డమైన పనులూ చేస్తుంది.అందరినీ మోసం చేస్తుంది డబ్బు కూడబెడుతుంది. కాని చిట్టచివరికి ఏమవుతుంది..? హటాత్తుగా మృత్యువు తలుపు తడుతుంది. "పట్టుకో, పట్టుకో" మని దురాశ తరిమితే నానా తంటాలు పడ్డవాడు, మృత్యువొచ్చి "వదిలేయ్, పో" అనగానే వొట్టి చేతుల్తో మొలమీద నూలుపోగు కూడా లేకుండా మట్టిలో కలిసిపోతాడు. ఆశబోతుకు బతుకు లేదురా నాన్నా, తెలుసుకో..తాత చెప్పుకుండూ పోతున్నాడు మనవడు తాత వంక కన్నార్పకుండా చూస్తూనే వున్నాడు మీరు ఈ కధ చదివినట్టు..

నేను కరెక్ట్ , నువ్వు రైట్ ....


ఇద్దరు మద్య అబిప్రాయబేదాలు సహజం అదే భార్యాభర్తలు అయితే మరీను కీచులాటలు,తగాదాలు,ఎడమోఖాలు పెడమోఖాలు ఇవ్వన్నీ మామూలే. అయ్య వారి ఆచార వ్యవహారాలు,ఆలోచనలు అమ్మ గారికి నచ్చవు, అమ్మ గారు పెరిగిన వాతావరణం,అక్కడి మనుషులు,మనస్తత్వాలు వేరు అవేమో అయ్యవారికి విచిత్రంగా వుంటాయి.
ఇక ఎలానో కాపురం మొదలుపెడతారు మొదట్లో తప్పక మరి కొంతకాలం ఒప్పక కొన్ని ఎడ్జెస్ట్ అవుతారు. మరి ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవటానికి కొంత సమయం అయితే కావాలి కదా..?ఇక కొంతవరకు ఎవరోఒకరు రాజీపడవలసిన అవసరం తప్పక ఏర్పడుతుంది.
అదే మన స్నేహితులుతో వస్తే వాడిని కొంత కాలం వదులుకుంటాం,బంధువులతొ అయితే దూరంగా వుండిపోతాం,పక్కింటివారితో మౌనంగా వుండిపోతాం చిట్ట చివరకు కన్నబిడ్డలతో అయినా సరే విడివిడిగా వుండి జీవిస్తాం. కానీ భార్యాభర్తలు...? జీవితాంతం ఒకరికొకరు తోడూనీడగా జీవించవలసిన వారు వీరిద్దరు మాత్రమే కలిసి మెలసి వుండాలి ఇద్దరం ఒకటై పోవాలి అనుకునేది,వుండేది వీరిద్దరు మాత్రమే.
మంచైనా,చెడైనా ఇంటి విషయాలైనా,బయటి విషయాలైనా,పిచ్చాపాటి మాట్లాడుకునేది కేవలం వీరిద్దరు మాత్రమే . ఎంత
చెప్పుకున్నా,మరెంత మాట్లాడుకున్నా వారికి ఇంకా చాలా మిగిలే వుంటాయి తిట్టుకున్నా,కొట్టుకున్నా మళ్ళీ ఏకమైపోయే బంధం వారిది. ఏ దాపరికాలూ, అరమికలూ లేని అనుబంధం వారిది. ప్రేమైక జీవులు వారు ప్రేమ కోసం జీవించే ప్రేమ పక్షులు వారు. మన జీవితభాగస్వామిని నిర్లక్ష్యం చేయడం అనేది మనకి మనమే విదించుకునే వింత శిక్ష.

నమ్మినవాడికి నాలుగు కాళ్లు..


నేను నడిచి వెళ్తున్నాను నేను మాత్రమే నాతో నా నీడ ఒకరికి ఒకరం తోడుగా మమేకమై వెళ్తున్నాము.కొంత దూరం వెళ్తూ వెనక్కి తిరిగి చూశాను నా రెండు పాద ముద్రలతో పాటు మరో రెండు ఉన్నాయి . ఆశ్చర్యం ఈ రెండు ఎక్కడివి ..? ఎవరివి.? మరికొంత కంగారు ఇంకొంత భయం . నా నీడను అడిగాను నవ్వింది చాలా విచిత్రంగా ఎప్పుడూ చూడని విదంగా చూసి నవ్వింది.శిగ్గుతో తల దించుకున్నాను ఆలోచిస్తున్నాను నడుస్తున్నాను .నడుస్తూ ఆలోచిస్తూ భయంతో నడుస్తున్నాను.
ఇంతలో ఒక అశరీరవాణి ఇలా పలికింది "ఆ పాదముద్రలు నావే నీ వెంట వుండి నిన్ను కాపాడుకుంట్టున్నాను నేను. నేను, నేను నీవు నమ్ముకున్న దేవుడ్ని."
ఆశ్చర్యం,ఆనందం మోకరిల్లాను ఏడ్చాను.సంతోషంగా నా జీవిత ప్రయాణం మొదలుపెట్టాను. కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్న జీవితసత్యం నాపట్ల కూడా కర్కసత్వం చూపింది అది నిజమైంది.నాకు కూడా కష్టాలు మొదలయ్యాయి,నా ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి,భరించలేని బాధ జీవితంలో మొదటి సారిగా ఓటమి ని ఓటమి అంచుల్ని చూస్తున్నాను.అప్పుడు గుర్తుకువచ్చాడు అప్పుడు మాత్రమే గుర్తుకువచ్చే నా దేవుడు గుర్తుకువచ్చాడు.కొండంత దైర్యంతో వెనక్కి తిరిగి చూసుకున్నాను రెండే వున్నాయి నాలుగు కదా..? అదేమిటి? నా నీడను అడిగాను నవ్వింది మరలా చాలా విచిత్రంగా ఎప్పుడూ చూడని విదంగా చూసి నవ్వింది.
దేవుణ్ని అడిగాను నేను సంతోషంగా వున్నంతకాలం నాతోనే వున్నావు ,నా బాధల్లో మాత్రం తప్పించుకున్నావు అని ఆక్రోశించాను మోసగించాడని నిందించాను.
పిచ్చినాయనా! నన్నే ఏవరో పిలిస్తున్నారు అవును నేను విన్న గొంతే నా దేవుడి గొంతు నాతో మట్లాడుతోంది, స్వామీ వెన్నకి తిరిగి చూశాను రెండే వున్నాయి మరి స్వామి..?
"పిచ్చినాయనా నీ కష్టాలు చూశే నీ బాధలు చూశి నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని మోస్తున్నాను రా!నీవి నేలమీద లేవు నాయనా ఆ రెండూ నావి."
ఇంత దయామయుడైన నా దేవుడ్ని ఎంత తప్పుగా అర్ధం చూసుకున్నాను , పశ్చాత్తాపంతో కుమిలిపోయాను భోరున ఏడిచాను క్షమించు దేవా !నీ లీలల్ని నేను తెలుసుకోలేక పోయాను అని సాష్టాంగపడ్డాను...శ్రీ

అమ్మ కోసం

అమ్మ..!
అమ్మ..! తొమ్మిది నెలలు మోసి మనల్ని కంటుంది, ఆ తొమ్మిది నెలలు నిండే వరకూ గర్భంలో వుండే మనల్ని మోస్తూనే వుంటుంది. నెత్తిన ఉన్న బరువా ఎమన్నా ? కావాలంటే దించుకోవటానికి కానీ ఇది అలా కాదే 24గంటలూ మోయవలసిందే ఆ తరువాత ప్రసవవేదన ఎంత నొప్పి ఎంత వేదన ఆ మహాతల్లిది మన కోసం మన జన్మ కోసం ఆ తల్లి పడని పాట్లు లేవు చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా వేసి అండగా మనకు జన్మనిస్తుంది. అమ్మకు అది పునర్జన్మే. ఈ తొమ్మిది నెలలూ ఆమె ఎన్నో నియమాలు, మరెన్నో పత్యాలు (అన్నీ మనకోసమె) ఆ తరువాత తన రక్తాన్ని పాలుగా మార్చి మనకందిస్తుంది. మనం మంచిగా పెరిగేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ఆమె పడని పాట్లు లేవు తన నిద్రను మర్చిపోతుంది, మన ముడ్డి కడుగుతుంది,వేయిదేవుళ్ళకు మ్రొక్కుతుంది ఆ పిచ్చితల్లి. మన కోసం మన మీద ఉన్న అవ్యాజమయిన ప్రేమ కోసం. మనం “ఊ”.. కొడితే ఉగ్గుగిన్నెలు,అడుగు లేస్తే అరిసెలు, గడప దాటితే గారెలు, పలకటం వస్తే పంచదార చిలుకలు పంచి పెట్టి పండుగ చేస్తుంది , మొదటి గురువుగా మాటలు నేర్పుతుంది , పాటలు పాడి నిద్రబుచ్చుతుంది. అన్నింటికీ మించి నీ తండ్రి ఫలానా అని మనకు చూపుతుంది . మనం పుట్టిన క్షణం నుండి తల్లి ఎవరో ఆమె స్పర్శ ఏమిటో మనకు తెలుసు కాని తండ్రి......? తల్లి చెబితేనే తెలుస్తుంది..
తల్లికి తన సంతానం పేగులో పేగు, రక్తంలో రక్తం అటువంటి తల్లి ప్రతి వ్యక్తికీ పూజనీయురాలు, వందనీయురాలు అందుకే “నూరుగురు సూర్యుల కంటే ఒక ఆచార్యుడు గొప్ప, నూరుగురు ఆచార్యులకంటే తండ్రి గొప్ప, నూరుగు తండ్రుల కంటే తల్లి గొప్ప” ఈ విషయం సాక్షాత్తు మనుస్మృతిలో చెప్పబడినది. తల్లి , తండ్రి , గురువు ఈ ముగ్గురూ జంగమ దేవతలు అంటే మన కళ్ల ముందు నడిచే దేవుళ్లు అని అర్దం.
“60 యేండ్లు దాటిన వృద్ధుడైనా తల్లి బ్రతికి ఉన్న వాడయితే బాలుడే , 5 యేండ్ల బాలుడైనా తల్లి లేకపోతే వృద్దుడే”ఇది స్కాంద పురాణంలో ప్రస్పుటంగా చెప్పబడినది..
నాకీ జన్మను ప్రసాదించిన నా తల్లికి అంకితమిస్తూ............శ్రీ

కాకి - పిచ్చుక కహాని

అనగా అనగా ఒక చిట్టడవి . ఆ అడవిలో ఒక పిచ్చుక దానికి తోడుగా ఒక కాకి ఉన్నాయి. పిచ్చుకది పిడకల యిల్లు. కాకిది కట్టెల ఇల్లు. రెండూ సుఖంగా ఉండేవి.
ఒకసారి పిచ్చుక కాకి దగ్గరకు వెళ్ళి “కాకి బావా కాకిబావా!” అని పిలిచింది కాకి “ఆ ఏమిటి అంటూ బయటికి వచ్చింది.
ఆ ఏమీ లేదు అందరూ చేలు వేసుకుంటున్నారు కదా మనమూ వేసుకుందామా..? అని అంది పిచ్చుక ఆలోచించిన కాకి ఆ వేసుకుందాము అంది.
కాకి మొక్కజొన్న చేను వేసింది, పిచ్చుక సెనగ చేను వేసింది .సోమరిపోతు అయిన కాకి సరిగ్గా కష్టపడేది కాదు అయినా పిచ్చక కష్టంతో రెండు చేలూ ఏపుగా పెరిగాయి ఇంతలో ఉన్నట్టు వుండి ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది కాకి కట్టెల యిల్లు ఎగిరిపోయింది . మొగ్గజొన్న పొడుగుగా ఉండటంవల్ల గాలికి వంగిపోయి పాడైపొయింది.
పిచ్చుకదేమో పిడకల గూడు కదా గాలికి చెక్కు చెదరలేదు. సెనగ పంట పొట్టిగా ఉంటుంది గదా. వానకు పాడవలేదు.
పిచ్చుక ఇల్లు, చేను చూచిన కాకికి కన్ను కుట్టింది ఎట్లాగయినా ఆ రెంటినీ కాజేయాలనుకుంది మరి మన పిచ్చుకేమో అమాయకపుది కదా కాకి పోట్లాటకు సై అంది పిచ్చుక తుర్రుమంది కాకి పెద్దదవటం వల్ల పిచ్చుకని కొట్టి పిచ్చుక ఇల్లూ, చేనూ ఆక్రమించుకుంది . పాపం పిచ్చుక చేసేది లేక ఏడుస్తూ వెళ్ళుతున్నది దారిలో దానికొక పాముపుట్ట కనిపించింది కాకిచేత ఇన్ని దెబ్బలు తిన్నాను ఇక బ్రతికేకంటే పాము చేత కరిపించుకొని చచ్చి పోవటం మంచిది అనుకొంది మన బంగారు పిచ్చుక.
ఏడుస్తూ పుట్టదగ్గరకు వెళ్ళి రంధ్రంలో వేలు పెట్టింది ఎంత సేపు అలా ఉంచినా పాము కరవలేదు , ఎందుకు కరవలేదబ్బా అనుకుంటూ వేలు తీసి చూసింది అరే మన బంగారు పిచ్చుక వేలికి బంగారు ఉంగరం వచ్చింది దానిని చూసి పిచ్చుక ఎగిరి గంతులేసంది మరలా కొంచ్చంసేపటికి అయ్యో ఇది నాది కాదు కదా! పాముది దానికే ఇచ్చేదాము అనుకొని ఇంకోసారి పాము పుట్టలో వేలు పెట్టింది కొంచెం సేపటికి మళ్ళీ తీసింది మళ్ళీ మరో వేలికి ఇంకో బంగారు ఉంగరం వచ్చింది.
ఆ రెండు ఉంగరాలు తీసుకుని పాముకు నమస్కారం తెలియచేసి వేరే ఇల్లు కట్టుకుందామని సంతోషంగా వుళుతున్నది . మార్గమద్య దారిలో కాకి పిచ్చుకని చూసి దాని దగ్గర ఉన్న బంగారు ఉంగరాలు చూచింది. కాకి ఎంతో ఆశ్చర్యపోయింది దుర్బుద్దితో వాటిని కాజేయాలని మెల్లగా పిచ్చుక దగ్గరకు చేరింది చేరి కపటం నటిస్తూ
"పిచ్చుక బావా పిచ్చుక బావా ! "నిన్ను కోపంలో కొట్టాను ఏమీ అనుకోకు అది సరేగాని ఇంతకు ఆ బంగారు ఉంగరాలు ఎక్కడివో చెప్పవా ?అని అడిగింది.
దాని కపట వేషం తెలియని అమాయకపు పిచ్చుక పాముపుట్టలో వేలు పెడితే దొరికాయి అని చెప్పింది
కాకికి దురాశ పుట్టింది పిచ్చుక కంటే ఎక్కువ బంగారం తెచ్చుకోవాలి అనుకొంది పిచ్చుకతో చెప్పా పెట్టకుండా గబగబ పాము పుట్టలో వేలు పెట్టింది దానిలో ఉన్న పాము అది గ్రహించి కోపంతో కరిచంది పాపం కాకి కెవ్వుమని అరిచి అక్కడి నుండి పారిపోయింది
పిచ్చుక మళ్ళీ తన పిడకల ఇంటికి వచ్చి కాకి జొన్న చేను ను తన సెనగ చేనును చూసుకుంటూ చాలా సుఖంగా ఉంది.

మృత్యుదేవత....

పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించి వూరుకున్నాడట సంహారం సంగతి ఆలోచించనే లేదు. జనాభా అంతకంతకూ పెరిగిపోయి భూమికి భారమైపోయారు ఆ క్షణం ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ బాధపడుతున్న బ్రహ్మ అవయవాలనుంచి ప్రళయాగ్ని పుట్టి ప్రజాసంహారం మొదలుపెట్టింది. భువనాలన్నీ అలా తగలబడిపోతుంటే చూడలేక పరమేశ్వరుడు బ్రహ్మ దగ్గరికి వచ్చి "అయ్యా నీ వల్ల పుట్టిన ఈ సృష్టిని కోపగించి నువ్వే నాశనం చేయటం తగునా అని ప్రార్ధించి దయతో యీ భూతాజాలన్ని కరుణించమని కోరెను" ఆ మాటలు విన్న విధాత తన కోపాన్ని దిగమింగే సమయంలో అతని ఇంద్రియాల నుంచి ఒక బయంకరమైన స్త్రీ ఉద్బవించింది
"నల్లని శరీరం , నిప్పుకణికల్లాంటి కళ్ళు, మెడలో పుర్రెలూ ,పొడవైన నల్లని జుత్తు, ఎర్రటి వస్త్రాలు, అతి భయంకరంగా వుంది" చకచక నడిచి వెళ్తోంది 'అమ్మాయీ !ఎక్కడికి పోతున్నావు ? ఇలారా అని పిలిచాడు బ్రహ్మ వచ్చి వినయంగా నిలబడింది
'నాలో పుట్టిన క్రోధం వల్ల జన్మించావు నువ్వు. అందుకని నా ఆజ్ఞ ప్రకారం నువ్వింక అన్ని ప్రాణుల్నీ సంహరిస్తూ వుండు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మ' ఆ మాటలు విన్న ఆ స్త్రీ జలజలా కన్నీళ్ళు కార్చింది . కరుణామూర్తీ నువ్వు సృష్టించావు నన్ను ఈ దుర్మార్గపు పని ఎలా చెయ్యమంటావు? ప్రజల ఏడుపు నేను చూడలేను ఈ అధర్మానికి నన్ను పంపకు నేను ధేనుకాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అనుజ్ఞ ఇవ్వమని వేడుకుంది.
అది విన్న బ్రహ్మ "పిచ్చిదానా ! నిన్ను ప్రజా సంహారం కోసమే సృష్టించాను అయినా ప్రజాసంహారం వల్ల నీకు అధర్మం ఎలా కలుగుతుంది? నా ఆజ్ఞ పాలించడం ధర్మం కాదా నీకు? నీకు అత్యుత్తమ కీర్తి లభించేటట్టు నేనూ పరమేశ్వరుడూ అనుగ్రహిస్తాం . నీవు మనస్సులో ఏ వికిరాలూ పెట్టుకొక సమయాన్ననుసరించి సంహారం చేయ్ అని ఆజ్ఞాపించెను.
" ప్రభూ! నీ ఆజ్ఞ శిరసావహిస్తాను కానీ "ఎవరైతే నాలుగు రకాల భూతాలనూ జయిస్తారో ఎవరైతే ధర్మ మార్గన్ని అనుసరాస్తారో , న్యాయాన్ని కాపాడుతారో వారి జోలికి నేను వెళ్ళలేను" అని వేడుకున్నది . కనుక స్వామీ లోభం,క్రోధం, అసూయ అనేవి ప్రాణుల శరీరాల్ని వికృతం చేసేటట్టు చూడు అంది దుఃఖిస్తూ
అలాగే ఇప్పుడు నువు కార్చిన కన్నీటిబిందువులే రోగాలై ప్రజల్ని పీడిస్తూ మరణాలు సంభవింప చేస్తాయి అందుచేత నీకు ఏ అధర్మం అంటదు ప్రాణుల్ని చంపడమే నీకు పరమధర్మం నువ్వు తరతమ భేదాలు లేకుండా అందర్నీ ఆకర్షించు వెళ్ళు అని అన్నాడు బ్రహ్మ..
ధర్మహాని లేదనే నమ్మకం కుదిరాక ఆమె ఆ పనికి అంగీకరించింది అప్పటినుంచీ మనోవ్యధ, రోగాలూ ప్రాణుల శరీరాల్ని కృశింప చేస్తుంటే మృత్యువు ప్రాణం తీస్తూ వస్తోంది ...

మహాభక్తురాలు అక్కమహాదేవి


పశ్చిమకర్ణాటకదేశంలో 'కల్యాణరాజ్యం' ఉండేది. ఆ రాజ్యం లోని "ఉడుతడి" అనే సంస్దానాన్ని "కౌశికుడు" అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ సంస్దాన రాణిగారు మహాబక్తురాలు ఒకరోజు ఉదయాన్నే "శివపూజ" చేసి భక్తి గీతాలు పాడుకుంటూ కూర్చున్నారు ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తూ కౌశికరాజు కూడా ఆమె చెంతకు వచ్చి కూర్చొని పరవశత్వంతో ఆమె పైట కొంగును పట్టుకున్నాడు ఇంతలో రాణిగారి గురువుగారు ఆమె దర్శనార్దమై ద్వారం చెంతకు రావటం గమనించిన రాణిగారు భక్తితో పరుగెత్తుకుంటూ పోయి గురువు గారికి పాదాభివందనం చేశారు ఈ హడావుడిలో పైట కౌశికరాజు చేతిలో ఉండిపోయింది. ఇది గమనించిన గురువు గారు ఆమెకు ఆ విషయాన్ని తెలియచేసారు ఆమె సిగ్గుతో తలదించుకొని లేచి వెళ్లి కౌశికుని చేతిలో వున్న పైటను తీసుకొని ధరించింది.
ఆ చేష్టను చూచిన కౌశికునికి ఎక్కడలేని కొపం వచ్చింది తీక్షణంగా ఆమె వంక చూసి కఠినంగా మాట్లడి ఆమె మనస్సును నొప్పించాడు భర్త కఠినోక్తులు ఆమెను కదిలించాయి
"వలువలు గట్టిన వారు కులముల నీడు వడల నరయుదురా..? మరులు గొన్నవారు సిగ్గుల నరయుదురా చెన్నమల్లికార్జునుని వరించిన వారు లోకాభిమానము నెరగుదురా" అని పాడుకున్నది
ఆ మరుక్షణమే సంసారబంధాన్ని త్రెంచుకొని విరాగిణయై "చెన్నమల్లికార్జునుని" వెదుక్కుంటూ బయలు దేరింది కల్యాణనగరంలో బసవేశ్వరుని అనుభవమంటపంలో చాలాకాలం వేదాంతచర్చల్లో కాలం గడిపింది అనంతరం "శ్రీశైలం" చేరుకొని "కదళీవనం" అనే ప్రాంతంలో తపస్సు చేసి శివుని సన్నిది చేరుకున్నది
'ఆమెయే మహాభక్తురాలు అక్కమహాదేవి' , శ్రీశైలమల్లికార్జుని దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడు తప్పగ దర్శించే స్దలం
దర్శనీయ స్దలం అక్కమహాదేవి గుహలు రెండు గంటలు పడవలో నీటి మీద, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి చుట్టూ చెట్లూ చెప్పని నలవి గాని చూడచక్కని భక్కిరసపూరితమైన దర్శనీయ స్దలం అక్కమహాదేవి గుహలు
కన్నడభాషలో తెలుగులోనూ ఆమె వ్రాసిన "వచనాలు" వందలకొద్దీ వున్నాయి అవి అన్నీ శివుణ్ణి కీర్తిస్తూ వ్రాసినవే అయితే మన దురదృష్టం వాటిలో ఎక్కువ బాగం ప్రచురితం కాకపోవటమే ...

కూడలి